tamilnadu: తమిళనాడులో మరో కొత్త పార్టీ... అమ్మ మక్కల్ మునేట్ర కజగం... దినకరన్ స్థాపన

  • ఇకపై తమిళనాడులో అన్ని ఎన్నికల్లోనూ తమదే విజయమని ప్రకటన
  • రెండాకుల గుర్తును సాధించేందుకు పోరాటం చేస్తాం
  • అప్పటి వరకు కుక్కర్ గుర్తుపైనే పోటీ
  • మధురైలోప్రకటించిన దినకరన్

తమిళనాడులో మరో కొత్త పార్టీ అవతరించింది. అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు టీటీవీ దినకరన్ ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. అమ్మ మక్కల్ మునేట్ర కజగం పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. మధురైలో జరిగిన సభలో ఈ మేరకు ప్రకటించారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, శశికళ ఫొటోలను పార్టీ బ్యానర్ పై చోటు కల్పించారు. దివంగత జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో ఇటీవలే దినకరన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తన పార్టీలో అమ్మ పేరు చేర్చడం ద్వారా ఆయన వ్యూహాత్మకంగా అడుగు వేశారు. కొత్త పార్టీ, జెండాతో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ తాము విజయం సాధిస్తామని దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. రెండు ఆకుల గుర్తు సాధించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. అప్పటి వరకు కుక్కర్ గుర్తుపైనే పోటీ చేస్తామని ప్రకటించారు.

More Telugu News