Pawan Kalyan: పవన్ పై ఎదురుదాడి మొదలు... మీడియా ముందుకు పల్లె రఘునాథ్

  • పవన్ లక్ష్యంగా టీడీపీ నేతల మాటల తూటాలు
  • బీజేపీ చేతిలో పావుగా మారిపోయారన్న పల్లె
  • ప్రజలకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని వెల్లడి
  • గౌరవంగా చూసుకుంటే దక్కిన ప్రతిఫలం ఇదా అని ప్రశ్న

పవన్ కల్యాణ్ పై టీడీపీ నేతల ఎదురుదాడి మొదలైంది. నిన్న ఆయన ఏపీ ప్రభుత్వం, మంత్రి లోకేష్ టార్గెట్ గా తీవ్ర విమర్శలే చేయగా, వాటిని తిప్పికొట్టాలని చంద్రబాబు నుంచి వచ్చిన సూచనల మేరకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన పల్లె రఘునాథ్, పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ నేతల హస్తముందని ఆరోపించారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మగా మారిపోయారని, వారు ఏం చెబితే పవన్ అది చేసే స్థితికి వచ్చేశారని నిప్పులు చెరిగారు. ఆయన మాటలు విన్న తరువాత ప్రజలకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని, బీజేపీ చేతిలో పవన్ పావుగా మారిపోయారని అన్నారు. పవన్ ఇచ్చిన సలహాలను తూ.చ తప్పక పాటించామని, ఎన్నికల్లో తమ వెంట నిలిచినందుకు ఆయన్ను గౌరవంగా చూస్తే, దానికి దక్కిన ప్రతిఫలం ఇదా? అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ టీడీపీపై ఈ తరహా విమర్శలు చేయని పవన్ కు ఒక్కసారిగా ఇంత తీవ్రమైన అవినీతి ఎలా కనిపించిందని పల్లె నిప్పులు చెరిగారు. పవన్ వ్యాఖ్యల వెనకున్న మతలబేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News