Thugs of Hindostan: పుట్టినరోజున ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచిన బాలీవుడ్ సూపర్‌స్టార్...తొలి ఫొటో తల్లిదే

  • 53వ పుట్టినరోజున ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెలిచిన అమీర్
  • తొలుత తల్లి ఫొటోని అప్‌లోడ్ చేసిన వైనం
  • ఖాతా తెరిచిన కొన్ని గంటల్లోనే వేలాది మంది ఫాలోవర్లు

బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా సూపర్‌స్టార్ అమీర్ ఖాన్‌ని చెప్పుకోవాలి. సినిమా సినిమాకి ఆయనేదో కొత్తగా చేయాలని తపిస్తుంటారు. తన ఫ్యాన్స్‌ని డిఫెరెంట్ గెటప్‌లతో, కథాంశాంలతో అలరిస్తుంటారు. అలాంటి అమీర్‌కు నిన్నటివరకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లేనే లేదు. అయితే తన అభిమానులకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో ఆయన తన 53వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అకౌంట్‌ను తెరిచారు. తొలుత తన తల్లి జీనత్ హుస్సేన్ ఫొటోను అప్ లోడ్ చేశారు. ఈ రకంగా తన ఇన్‌స్టాగ్రామ్ జర్నీని చాలా సింపుల్‌గా ఆయన ప్రారంభించారు.

తన మొట్టమొదటి పోస్టు గురించి ఆయన ఈ విధంగా రాశారు..."ప్రస్తుతం నేను ఎవరిని..నేను ఎవరు? అనే దానికి కారణం ఈ వ్యక్తే" అంటూ తన తల్లి ఫొటోని ఆయన పోస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమీర్ అలా అకౌంట్‌ను తెరిచారో లేదో వేలాది మంది ఆయన్ను ఫాలో అవడం మొదలుపెట్టేశారంటే ఆయనకున్న క్రేజ్ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా, అమీర్‌ని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఇప్పటికే వేలాది మంది ఫాలో అవుతోన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' చిత్రం ప్రస్తుతం జోధ్‌పూర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

More Telugu News