vinukonda: ఏపీ దెబ్బ యూపీలో తగిలింది: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

  • గోరఖ్ పూర్ లో అధిక సంఖ్యలో తెలుగు వాళ్లు ఉన్నారు
  • బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారు
  • ఏపీని బీజేపీ మోసం చేసిన ప్రభావం అక్కడ ప్రతిఫలించింది
  • ఆ పార్టీకి తెలుగోడి ఉసురు తగులుతోంది : జీవీ ఆంజనేయులు

యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడంపై వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ దెబ్బ యూపీలో తగిలిందని, గోరఖ్ పూర్ లో అధిక సంఖ్యలో ఉన్న తెలుగు వాళ్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని విమర్శించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన తెలుగు వారు అధిక సంఖ్యలో గోరఖ్ పూర్ కు వలస వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏపీని బీజేపీ మోసం చేసిన ప్రభావం అక్కడ ప్రతిఫలించిందని, ఆ పార్టీకి తెలుగోడి ఉసురు తగులుతోందని దుయ్యబట్టారు. కర్ణాటక రాష్ట్రంలోనూ ఎక్కువ మంది తెలుగువారు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆంజనేయులు గుర్తు చేశారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి.

More Telugu News