team india: ఫైనల్ లో బెర్తు కోసం టీమిండియా, బంగ్లాదేశ్ పోరాటం

  • రెండు టీ20 మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా
  • ఒక టీ20 మ్యాచ్ లో విజయం సాధించిన బంగ్లాదేశ్
  • నేటి మ్యాచ్ లో విజయంపై రెండు జట్లకు ఆశ

నిదహస్‌ టీ20 టోర్నీలో భాగంగా టీమిండియా నేడు బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఇప్పటికే రెండు విజయాలతో, నెట్ రన్ రేట్ లో మెరుగ్గా ఉన్న టీమిండియా ఫైనల్ లో ప్రవేశించింది. నేటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధిస్తే సమీకరణాలతో సంబంధం లేకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో టోర్నీ ఫైనల్ చేరుతుంది. బంగ్లాదేశ్ ఆడిన రెండు లీగ్ లలో ఒక దానిలో విజయం సాధించగా, మరొకదానిలో ఓటమిపాలైంది. నేటి మ్యాచ్ లో ఓటమిపాలైనప్పటికీ శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే ఆ జట్టు ఫైనల్ చేరుతుంది. లేని పక్షంలో నేటి మ్యాచ్ లో బంగ్లా జట్టు విజయం సాధించి, శ్రీలంక చేతిలో ఓడితే జట్లన్నీ నాలుగేసి పాయింట్లతో రన్ రేట్ ఆధారంగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లో విజయం సాధించడం రెండు జట్లకు చాలా అవసరం.

దీంతో ప్రయోగాలకు పోకుండా గత మ్యాచ్ లో ఆడిన జట్టునే టీమిండియా బరిలో దించాలని భావిస్తోంది. ఫాంలో లేని రోహిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి, లోకేష్ రాహుల్ ను ఓపెనర్ గా పంపాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక ప్రధాన బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ధారాళంగా పరుగులివ్వడం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. శార్థుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్, శంకర్, చాహల్ రాణిస్తుండడంతో టీమిండియా బౌలింగ్ విభాగంలో ఫర్వాలేదనిపిస్తోంది. మరోవైపు భారత్ ను ఓడించాలన్న లక్ష్యంతో ముష్ఫికర్‌ బృందం బరిలో దిగనుంది. ఆతిథ్య శ్రీలంకతో మ్యాచ్‌ లో విజయం సాధించిన ఉత్సాహంతో ఆ జట్టు బరిలో దిగుతోంది. తమీమ్‌ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్‌ దాస్, ముష్ఫికర్‌ రహీమ్‌ లపై ఆ జట్టు భారమేసింది. ఇప్పటికే నిరూపించుకున్న ముస్తాఫిజుర్, రూబెల్‌ హుస్సేన్, స్పిన్నర్‌ మెహదీ హసన్‌ లు రాణించాలని బంగ్లాదేశ్ కోరుకుంటోంది.

More Telugu News