Priyamani: నష్టపరిహారానికి నటి ప్రియమణి డిమాండ్..!

  • అంగుళిక చిత్ర దర్శకనిర్మాతలపై 'మా'కి ఫిర్యాదు
  • సినిమా ప్రచారం కోసం తన ఇమేజ్‌లు వాడుకున్నారని ఆరోపణ
  • వారిపై చర్యలు తీసుకోవాలని వినతి

ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమాకు సైన్ చేయని అందాల నటి ప్రియమణి అంగుళిక సినిమా దర్శకనిర్మాతలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కి ఫిర్యాదు చేసింది. సినిమా ప్రచారం కోసం వారు తన ఫొటోలను వాడుకున్నారని, అందువల్ల వారు తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె తన ఫిర్యాదులో డిమాండ్ చేసింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఐదేళ్ల కిందటే ప్రారంభమయింది. అయితే ఇటీవలే పూర్తయింది. "ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించేందుకు తొలుత నేను సంతకం చేశాను. కానీ, కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను. తర్వాత దర్శకనిర్మాతలు వేరే హీరోయిన్‌తో సినిమాను పూర్తి చేశారు. అయితే సినిమా టీజర్‌లో మాత్రం వారు నా ఫొటోలను వాడుకున్నారు. అందువల్ల వారిపై తగు చర్యలు తీసుకోవడంతో పాటు నాకు నష్టపరిహారం ఇప్పించాలి" అని ప్రియమణి తన ఫిర్యాదులో డిమాండ్ చేసింది. ప్రియమణి ఫిర్యాదును 'మా' కార్యాలయానికి అందజేశానని ఆమె మేనేజర్ జి.హరినాథ్ తెలిపారు.

More Telugu News