child porn racket: ఇదెక్కడి ఘోరం! చైల్డ్ పోర్న్ రాకెట్‌లో 40 దేశాలు.. 119 మందికి ప్రమేయం: సీబీఐ

  • రాకెట్‌లో అత్యధిక శాతం భారతీయులే
  • పాకిస్థాన్, చైనా, శ్రీలంక, అమెరికా, నైజీరియా.. బ్రెజిల్ దేశీయులకూ ప్రమేయం
  • ఇంటర్‌పోల్ సాయాన్ని అర్థించిన సీబీఐ

చైల్డ్ పోర్న్ రాకెట్‌లో మొత్తం 40 దేశాలకు చెందిన 119  మంది ప్రమేయం ఉందంటూ సీబీఐ సంచలన ప్రకటన చేసింది. వాట్సాప్ గ్రూప్‌లో చిన్నారులకు చెందిన వీడియోలను పంపుతున్న ముఠాలోని ఐదుగురు సభ్యుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించిన దర్యాప్తు సంస్థ తాజా వివరాలను వెల్లడించింది. ఈ రాకెట్‌లో మొత్తం 40 దేశాలకు చెందిన 119 మందికి సంబంధం ఉందని తెలిపింది. ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేసిన సీబీఐ ఇంటర్‌పోల్ సాయాన్ని అర్థించింది.

ఈ రాకెట్‌లో అత్యధికశాతం మంది భారతీయులేనని సీబీఐ పేర్కొంది. 66 మంది భారతీయులు, 56 మంది పాకిస్థానీలు, అమెరికన్లు 29 మంది ఉన్నట్టు వివరించింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు త్రివేండ్రంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్(టి)లో ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్టు సీబీఐ వివరించింది.

వాట్సాప్ గ్రూప్‌లోని మొత్తం ఐదుగురిపైనా కేసులు నమోదు చేశామని, పరారీలో ఉన్న మిగతా నలుగురి కోసం ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో గాలిస్తున్నట్టు పేర్కొంది. చైల్డ్ పోర్న్ రాకెట్‌లో బ్రెజిల్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, కెన్యా, నైజీరియా, శ్రీలంక, అమెరికా, చైనీయులకు ప్రమేయం ఉందని తెలిపింది.

ఫిబ్రవరి 22న ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో నిర్వహించిన తనిఖీల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అలాగే 20 ఏళ్ల నిఖిల్ వర్మను అరెస్ట్ చేశారు.

More Telugu News