Shami: క్రికెటర్ షమీ భార్య అసహనం....మీడియాపై దాడి...కెమేరా ధ్వంసం

  • మీడియా ప్రశ్నలకు చిరాకుతో అసహనం
  • గట్టిగా అరుపులు..ఎస్‌యూవీ కారులో వెళ్లిపోయిన వైనం
  • అండగా నిలుస్తున్న అభిమానులకు ట్విట్టర్‌లో షమీ థ్యాంక్స్

టీమిండియా క్రికెటర్ షమీ భార్య జహాన్ మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తన భర్తపై వివాహేతర సంబంధాల ఆరోపణలతో వార్తల్లోకెక్కిన ఆమె మీడియాపై దాడికి పూనుకుంది. కోల్‌కతా నగరంలోని సెయింట్ సెబాస్టియన్స్ స్కూల్ ఆవరణలో జర్నలిస్టులు ఈ రోజు తనను వీడియోలో బంధిస్తుండగా ఓ కెమేరాను ఆమె పగులగొట్టింది. మీడియా ప్రశ్నలకు విసుగుచెంది గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి తన ఎస్‌యూవీ కారులో వెళ్లిపోయింది. ఇప్పటివరకు తన భర్తకు సంబంధించిన విషయాలను 'కూల్‌'గా చెప్పిన జహాన్..ఇలా దాడి చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌తో పాటు ఎంఎస్ ధోనీ లాంటి వాళ్లు షమీ మంచోడంటూ అతనికి బాసటగా నిలుస్తున్నారు. తనకు మద్దతిస్తున్న అభిమానులకు అతను ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. భార్య ఫిర్యాదు మేరకు అతనిపై ఈ నెల 9న హత్యాయత్నం, గృహ హింస కేసులు నమోదయ్యాయి. తాజా కేసు నేపథ్యంలో ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ టోర్నీలో అతను పాల్గొంటాడా? లేదా? అన్నది సస్పెన్స్‌‍గా మారింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ (డీడీ) ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేసిన సంగతి విదితమే.

More Telugu News