Ramill Kavita: తెలంగాణలో తెలుగుదేశం మహిళా నేత దారుణ హత్య... కుమార్తె చూస్తుండగానే ఘాతుకం!

  • మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు కవిత
  • పెళ్లికి వెళ్లి రాగానే దుండగుల దాడి
  • తలనరికి చంపిన దుండగులు

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రాణిస్తున్న యువ మహిళా నేత, కుమార్తె కళ్ల ముందే దారుణ హత్యకు గురైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కాటారం మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు రామిల్ల కవిత (30), పదేళ్ల క్రితం భర్తతో విడిపోయి, తన ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది.

తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు పిల్లలతో కలసి మంథనికి వెళ్లిన ఆమె, నూతన వధువుకు తోడుగా చిన్న కుమార్తెను ఉంచి, పెద్ద కుమార్తెతో కలసి ఇంటికి చేరుకుంది. ఆపై ఆమె ఇంట్లోకి చొరబడిన దుండగులు, కుమార్తె చేతులు కట్టేసి ఓ గదిలో బంధించారు. ఆమె చూస్తుండగానే కత్తిపీటతో కవిత తలనరికి హత్య చేశారు. ఆపై ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.

More Telugu News