somi reddy: ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పోషించిన పాత్ర ‘జీరో’ : టీడీపీ నేత సోమిరెడ్డి

  • చేతకాని దద్దమ్మల పార్టీ వైసీపీ
  • అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుకాకపోవడం దారుణం
  • కేంద్రంపై వైసీపీ అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందా?
  • జగన్ పై నిప్పులు చెరిగిన సోమిరెడ్డి

వైసీపీ లాంటి ప్రతిపక్షాన్ని దేశంలో ఎక్కడా చూడలేదని ఏపీ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన నేపథ్యంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుకాకపోవడం దారుణమని, చేతకాని దద్దమ్మల పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పోషించిన పాత్ర ‘జీరో’ అని, ఏపీకి జరిగిన అన్యాయం విషయమై తమ పార్టీ ఎంపీలతో 2016లోనే రాజీనామా చేయిస్తానని జగన్ అన్నారని, ఆవిధంగా ఎందుకు చేయలేదని, అసలు, వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తామంటే ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యాక వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా ప్రయోజనం ఉండదని, సమావేశాలకు ముందే వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెడతామని జగన్ అంటున్నారని, ఆయన ఆవిధంగా చేసినంత మాత్రాన బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ఎంపీలతో రాజీనామాలు చేయించే ధైర్యం లేని జగన్, గల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా చంద్రబాబును విమర్శిస్తుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.  

More Telugu News