Tamilnadu: తమిళనాడులో పెను విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి కార్చిచ్చులో చిక్కుకున్న విద్యార్థుల బృందం.. ఐదుగురు మృతి

  • కురంగణి పర్వత ప్రాంతాల్లో ఘటన
  • హెలికాప్టర్ల సాయంతో 15 మందిని రక్షించిన రెస్క్యూ బృందం
  • మరికొందరు గల్లంతు.. కొనసాగుతున్న ఆపరేషన్

ఆదివారం తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్వాతారోహణకు వెళ్లిన విద్యార్థుల బృందంలో ఐదుగురు కార్చిచ్చుకు బలయ్యారు. మున్నార్ ప్రాంతంలోని సూర్యనెల్లికి చెందిన 37 మంది విద్యార్థినులు రెండు బృందాలుగా తమిళనాడులోని తేని జిల్లా కురంగణి ప్రాంతంలో పర్వతారోహణ శిక్షణ కోసం వచ్చారు. వారు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కార్చిచ్చు రేగడంతో వారంతా మంటల్లో చిక్కుకున్నారు. విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. మంటల నుంచి కొందరు తప్పించుకోగా చిక్కుకుపోయిన  ఐదుగురు విద్యార్థినులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 15 మంది విద్యార్థినులను హెలికాప్టర్ల సాయంతో రక్షించినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరికొందరు గల్లంతయ్యారు.

ఈ ప్రాంతంలో వెలుతురు తక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడినట్టు మదురై సర్కిల్ కన్జర్వేటర్ ఆర్కే జగేనియా తెలిపారు. మంటలు వేగంగా నలువైపులా వ్యాపిస్తుండడంతో అటవీ సిబ్బంది, సమీప గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.  

చెన్నైకి చెందిన ఓ ట్రెక్కింగ్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల బృందం పశ్చిమ కనుమల్లోని బోధికి చేరుకుంది. శుక్రవారం ట్రెక్కింగ్ ప్రారంభం కాగా శనివారం కేరళవైపు అడవుల్లోకి చేరుకున్నారు. ఆదివారం కురంగణి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించారు. ఆదివారం సాయంత్రానికి వారు తిరిగి బోధి చేరుకుని చెన్నైకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా అంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News