Krish: అల్లు అర్జున్ కొత్త అవతారం...!

  • దర్శకుడు క్రిష్‌తో కలిసి సినిమా నిర్మించేందుకు ఆసక్తి
  • గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వేదం' సినిమా హిట్
  • క్రిష్ 'అహం బ్రహ్మాస్మి' ప్రాజెక్టుపై స్టైలిష్ స్టార్ నజర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త అవతారమెత్తబోతున్నాడు. అతను నటుడిగా ఇప్పటివరకు విలక్షణమైన పాత్రలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. ఇప్పుడు సినీ నిర్మాణంపై ఈ యువ హీరో నజర్ పడినట్లు తెలిసింది. తనతో 'వేదం' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ)తో కలిసి ఓ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. క్రిష్ తన తదుపరి చిత్రానికి 'అహం బ్రహ్మాస్మి' టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఈ ప్రాజెక్టును ఆయనతో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించేందుకు అల్లు అర్జున్ ఆసక్తిగా ఉన్నట్లు ఫిలింవర్గాల సమాచారం. ఈ సినిమా పెట్టుబడిలో తాను సగం ఇన్వెస్ట్ చేస్తానని, వచ్చిన లాభాలను సమంగా పంచుకుందామని అల్లు అర్జున్ చెబుతున్నట్లు తెలిసింది. అయితే క్రిష్ తన తండ్రితో కలిసి ఈ ప్రాజెక్టును నిర్మించాలని అనుకుంటున్నట్లు మరో వార్త వినబడుతోంది. క్రిష్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. మరికొన్ని రోజులు ఆగితే కాని ఈ సినిమాకు సహ నిర్మాత ఎవరనే సస్పెన్స్‌కు తెరపడదు.

More Telugu News