Saudi Arebia: సింహంతో ఆడుకునేందుకు బోనులోకి బాలబాలికలు... ఆపై భయంకర దృశ్యం వీడియో!

  • సౌదీ అరేబియాలోని జెడ్డాలో స్ప్రింగ్ ఫెస్టివల్
  • సింహంతో ఆడుకునేందుకు వెళ్లిన బాలబాలికలు
  • ఓ అమ్మాయిపై దాడి చేసిన సింహం
  • స్వల్ప గాయాలతో బయటపడిన అమ్మాయి

అది ఆరునెలల వయసుకే దాదాపు 200 కిలోలకు పైగా బరువు పెరిగిన మృగరాజు. దానితో ఆడుకోవాలంటూ బాల బాలికలను సింహం ఉన్న బోనులోకి వదిలారు. ఆపై పిల్లలను చూసిన కంగారో, లేక అది కూడా ఆడుకుందామని భావించిందో, ఓ బాలికను నోట కరచుకుంది. ఆ బాలిక స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ, ఈ భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, సౌదీ అరేబియాలోని జెడ్డాలో స్ప్రింగ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ మచ్చిక చేసుకున్న సింహాన్ని బోనులోకి పంపి, పదేళ్ల వయసున్న పిల్లలను దాంతో ఆడుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఆ బోనులో పిల్లలతో పాటు సింహానికి శిక్షణ ఇస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు. పిల్లలు కేరింతలు కొడుతూ, సింహం చుట్టూ తిరుగుతూ, దాన్ని పరిగెత్తిస్తుంటే, సడన్ గా ఓ బాలిక దానికి కనిపించింది. క్షణాల వ్యవధిలో బాలికపైకి లంఘించిన సింహం, ఆమెను కిందపడేసి తలను నోటిలోకి తీసుకోబోయింది. వెంటనే ట్రైనర్ వచ్చి బాలికను కొంత శ్రమించి సింహం బిగి కౌగిలి నుంచి బయటకు లాగాడు. ఈ ప్రయత్నంలో కొందరు చిన్నారులు కూడా ఆయనకు సహకరించారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News