Medak District: మెదక్‌ జిల్లాలో కేవలం 4 గంటల్లో అండర్ గ్రౌండ్ వంతెన నిర్మాణం

  • వెల్దుర్తి మండలం మాసాయిపేటలో రైల్వే అధికారుల ఘనత
  • వంతెన నిర్మాణం కోసం రూ.1.65 కోట్ల ఖర్చు
  • గతంలో ఈ ప్రాంతంలో రైలు ప్రమాదంలో 16 మంది చిన్నారుల మృతి
  • సదరు ఘటన నేపథ్యంలో అండర్ గ్రౌండ్ నిర్మాణం

మెద‌క్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో నాలుగు గంటల వ్యవధిలోనే అండర్ గ్రౌండ్ వంతెన నిర్మాణం పనులు పూర్తి చేశారు రైల్వే అధికారులు. ఈ వంతెన నిర్మాణం కోసం 1.65 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల చొరవతో అండర్ గ్రౌండ్ వంతెన పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా, 2014 జూలై 24న రైలు ప్రమాదంలో 16 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో వంతెన నిర్మాణం పనులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇంజనీర్ మోతిలాల్ తెలిపారు.      కాగా, మాసాయిపేటలో అప్పట్లో జరిగిన రైలు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాసాయిపేట వద్ద కాపలా లేని రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద తూప్రాన్‌కు చెందిన కాకతీయ టెక్నో స్కూల్‌ బస్సును నాందేడ్‌ ప్యాసింజర్‌ రైలు ఢీ కొట్టడంతో 16మంది విద్యార్థులతో పాటు బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ ప్రాణాలు కోల్పోయారు.     

More Telugu News