నేనా.. టీఆర్ఎస్‌లో చేరడమా.. నెవ్వర్!: పుకార్లపై స్పందించిన బీజేపీ నేత కిషన్ రెడ్డి!

  • లక్షమంది కేసీఆర్‌లు వచ్చినా బీజేపీని వీడేది లేదు
  • చివరి వరకు బీజేపీలోనే
  • టీఆర్ఎస్ రాక్షస పాలనపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది
తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి స్పందించారు. లక్ష మంది కేసీఆర్‌లు, వెయ్యి టీఆర్ఎస్‌లు వచ్చినా తాను బీజేపీని వీడేది లేదని, అది ఎన్నటికీ జరగనిదని కుండ బద్దలు కొట్టారు. బుధవారం వివిధ ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి తాను చివరి వరకు బీజేపీలోనే కొనసాగుతానని, టీఆర్ఎస్‌ రాక్షస పాలనపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకు కేటాయించాలంటూ పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలపడం దురదృష్టకరమన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు వితండవాదంతో ఢిల్లీలో తెలంగాణ పరువును మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ కనుసన్నల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నడుచుకుంటోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకుండా వారి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దారుణంగా దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Kishan Reddy
BJP
Telangana
TRS
KCR

More Telugu News