JC Diwakar Reddy: మా నిరసనలు దున్నపోతుపై పడే వానేనని తెలుసు: ఎంపీ జేసీ కీలక వ్యాఖ్యలు

  • హోదా బదులు ప్యాకేజీ అంటే ఒప్పుకున్నాం
  • అది కూడా ఇవ్వడం లేదు
  • స్వలాభం కోసం నిరసనలు చేయడం లేదు
  • నష్టపోయాం కాబట్టి ఆదుకోమని కోరుతున్నాం

తొలుత ప్రత్యేక హోదా ఇస్తామని, ఆ తరువాత ప్యాకేజీకి ఒప్పించి, ఆపై మాటలు మార్చుతూ విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఉదయం పార్లమెంట్ ఎదుట మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రం ప్యాకేజీ ఇస్తామన్న తరువాత, అందుకు సరిపడా డబ్బు ఇచ్చినా ఇంత ఆగ్రహం వ్యక్తమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. కేంద్రం కొంత డబ్బు ఇచ్చిన మాట వాస్తవమేనని, అది ఏ మూలకూ సరిపోయేది కాదని అన్నారు.

 "కేంద్రం డబ్బు ఇవ్వలేదని చెప్పడంలా. కానీ ప్యాకేజీలో మీరు ఎంతో ఇస్తామని చెప్పారు. కొంతే ఇచ్చారు. మా రాష్ట్రంలో డిమాండ్ అలా ఉంది. మా స్వలాభం కోసం అడగడంలా. నష్టపోయాం కాబట్టి అడుగుతున్నాం. మా రాష్ట్ర డెవలప్ మెంట్ కోసం విభజన చట్టంలో ఉన్నవి మాత్రమే అడుగుతున్నాం. చట్టంలో లేనివి మాకు వద్దే వద్దు. ఉన్నవి చేస్తే చాలు. వుయ్ ఆర్ వెరీ హ్యాపీ... కానీ, మీరు మాట తప్పారు. పార్లమెంట్ లో ఇచ్చిన మాటను, బయట ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. మా నిరసనలు దున్నపోతుపై పడే వానవంటిదని తెలుసు. అయినా కూడా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు కేంద్రం చేస్తున్న దుశ్చర్యలను తెలియజేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం" అన్నారు.

More Telugu News