KCR: జేసీబీ నడిపిన తెలంగాణ మంత్రి పద్మారావు

  • సికింద్రాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమిపూజ 
  • రాష్ట్ర ప్రభుత్వానికి స్థలాల కొరత ఉంది- పద్మారావు
  • డబుల్ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి మిగులు రైల్వే స్థలాన్ని కేటాయించాలి
  • రైల్వే శాఖను ఒప్పించేందుకు సీఎం కేసీఆర్ సైతం కృషి

సికింద్రాబాద్ పరిధిలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు జరుపుతున్నామని, ఈ ప్రక్రియలో సహకరించాల్సిన బాధ్య‌త కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉందని తెలంగాణ మంత్రి పద్మారావు గౌడ్ అన్నారు. ఈ రోజు సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా జేసీబీ నడిపించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో అధిక భాగం రైల్వే స్థలాలే ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్థలాల కొరత ఉన్నందున  డబుల్ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి మిగులు రైల్వే స్థలాన్ని కేటాయించాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ ను కోరామని తెలిపారు. రైల్వే శాఖ ద్వారా సానుకూల స్పందన లభించిన వెంటనే లాలాపేట్ లో డబుల్ బెడ్రూమ్ సముదాయాలను నిర్మించాలని భావిస్తున్నామని మంత్రి పద్మారావు వివరించారు.     ఈ లోగానే నిరుపేద లబ్దిదారుల కోసం సికింద్రాబాద్ లోని 4 ప్రదేశాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులను ప్రారంభించామని తెలిపారు. దోభిఘాట్ లో స్థానికుల కోసం 216 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఏసీఎస్‌ నగర్ లో 48 ఇళ్లు, సుభాష్ చంద్రబోస్‌ నగర్ లో 40 ఇళ్లు, సాయినగర్‌లో 104 ఇళ్లు నిర్మించేలా ఏర్పాట్లు జరిపామని వివరించారు. దాదాపు రూ.33.56 కోట్ల భారీ ఖర్చుతో చేపడుతున్న ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రైల్వే శాఖ ద్వారా ఆమోదం లభించిన వెంటనే సికింద్రాబాద్ లో భారీ స్థాయిలోనే డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని, రైల్వే శాఖను ఒప్పించేందుకు సీఎం కేసీఆర్ సైతం కృషి చేస్తున్నారని తెలిపారు.

More Telugu News