Mekapati Rajamohan Reddy: చంద్రబాబు గ్రామ సర్పంచ్‌గా కూడా పనికిరారు...మేకపాటి ధ్వజం

  • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది
  • ప్రజల ఆకాంక్షలను గుర్తించే వరకు పోరాటం ఆగదు
  • వైసీపీ ఎంపీలు మేకపాటి, వైవీ స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రామ సర్పంచి పదవికి కూడా పనికిరారని వైసీపీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ రోజు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం వైసీపీ నేతలు ఈ ఉదయం న్యూఢిల్లీలోని సన్సద్ మార్గ్ వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాబుపై మేకపాటి ధ్వజమెత్తారు. బాబు కనీసం ఓ గ్రామానికి సర్పంచ్‌గా కూడా పనికిరారని ఆయన ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చడంలోనూ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంలోనూ బాబు ఘోరంగా విఫలమయ్యారని మేకపాటి విమర్శించారు. వైసీపీకి చెందిన మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ...ప్రజల ఆకాంక్షలను గుర్తించేంత వరకు ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంజీవిని లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News