Sridevi: అసలు ఆ రోజు ఏం జరిగిందంటే... శ్రీదేవి మరణంపై తొలిసారి నోరు విప్పిన బోనీ కపూర్!

  • బాల్య మిత్రుడు కోమల్ నాహ్తాకు విషయం చెప్పిన బోనీ
  • రెండు రోజులు శ్రీదేవి ఒంటరిగా దుబాయ్ లో మాత్రమే ఉంది
  • సర్ ప్రైజ్ ఇద్దామనే దుబాయ్ వెళ్లాను
  • తాను వెళ్లిన అరగంటలో మొత్తం జరిగిపోయిందన్న బోనీ

గత వారం దుబాయ్ లో మరణించిన ప్రముఖ నటి శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు, పలు రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆమె భర్త బోనీ కపూర్ తొలిసారి నోరువిప్పాడు. తన చిన్ననాటి స్నేహితుడు, ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నాహ్తాకు అంత్యక్రియలకు కొద్దిసేపటి ముందు అసలు ఏం జరిగిందన్న విషయాన్ని వెల్లడించగా, నాహ్తా తమ మొత్తం సంభాషణను ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. నాహ్తా కథనం ప్రకారం, బోనీ ఏం చెప్పారంటే...

"ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం నేను శ్రీదేవితో మాట్లాడాను. సాయంత్రం నేను దుబాయ్‌ కి వస్తున్నట్టు ఆమెకు చెప్పనేలేదు. నేను దుబాయ్‌ కి వెళ్లాలన్న ఆలోచనకు జాన్వీ ఓకే చెప్పింది కూడా. శ్రీదేవి ఒంటరిగా ఉంటే భయపడుతుందని, పాస్‌ పోర్ట్ తదితరాలను ఎక్కడైనా పెట్టి మరచి పోతుందన్నది జాన్వీ భయం. గడచిన 24 సంవత్సరాల్లో నేను, శ్రీదేవి కలసి విదేశాలకు కేవలం రెండుసార్లు మాత్రమే వెళ్లాము. న్యూజెర్సీ, వాంకోవర్‌ లకు శ్రీదేవి వెళ్లినప్పుడు కూడా నేను వెళ్లలేదు. అప్పుడు ఓ స్నేహితుడిని తోడుగా పంపాను.

రెండు రోజులు శ్రీదేవి ఒంటరిగా విదేశాల్లో ఉండటం దుబాయ్ లోనే జరిగింది. ఫిబ్రవరి 20న ఓ వివాహం నిమిత్తం నేను, శ్రీదేవి, ఖుషీ దుబాయ్‌ వెళ్లాం. 22న లక్నోలో ఓ సమావేశం ఉండటంతో దానికి హాజరయ్యేందుకు నేను వెనక్కు వచ్చాను. 22, 23వ తేదీల్లో జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌ లోని 2201 నంబర్ రూములో బసచేసిన శ్రీదేవి, జాన్వీ కోసం షాపింగ్‌ చేసింది. ఆమెకు సర్ ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో  ఫిబ్రవరి 24న మధ్యాహ్నం నేను బయలుదేరాను. దుబాయ్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 గంటలకు శ్రీదేవి దగ్గరికి వెళ్లాను.

నన్ను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఓ పావుగంట మాట్లాడుకున్న తరువాత ఫ్రెషప్ అయి, రొమాంటిక్‌ డిన్నర్‌కు వెళదామని చెప్పాను. దానికి శ్రీదేవి ఓకే చెప్పి, స్నానం చేసేందుకు బాత్ రూముకు వెళ్లింది. నేను కాసేపు టీవీ చూస్తూ గడిపాను. 8 గంటలైనా ఆమె బయటకు రాకపోవడంతో, హోటల్ లో రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో నేనే రెండుసార్లు పెద్దగా పిలిచినా స్పందన లేదు. ఆపై డోర్ తట్టినా సమాధానం లేదు. లోపల ట్యాప్ ఆన్ చేసినట్టు శబ్దం వినిపించింది. ఎటువంటి మాటలూ రాకపోవడంతో ఆందోళనతో డోర్ తెరిచే ప్రయత్నం చేశాను. లోపలివైపున బోల్ట్ పెట్టక పోవడంతో వెంటనే డోర్ తెరచుకుంది. లోపల బాత్ టబ్ లోని నీటిలో చలనం లేకుండా శ్రీదేవి కనిపించింది. దీంతో ఒక్కసారిగా భూమి బద్దలైపోయినట్లయింది" అని బోనీ కపూర్ వెల్లడించినట్టు కోమల్ వెల్లడించాడు.

More Telugu News