Maharashtra: పూణె అల్లర్ల నిందితుడిని ‘పద్మశ్రీ’కి సిఫారసు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

  • శంభాజీ భిడేపై పలు కేసులు నమోదు
  • పద్మశ్రీకి సిఫారు చేసిన మంత్రుల కమిటీ
  • వెలుగులోకి రావడంతో ప్రభుత్వంపై విమర్శలు

భీమా-కొరెగావ్ అల్లర్ల కేసులో నిందితుడైన సంగిలికి చెందిన రైట్ వింగ్ నేత మనోహర్ అలియాస్ శాంభాజీ భిడేను మహారాష్ట్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డు కోసం సిఫారసు చేయడం చర్చనీయాంశమైంది. పదిమంది సీనియర్ మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ భిడేను ‘పద్మశ్రీ’ అవార్డు కోసం సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు సంబంధించిన పత్రాలు ఇంకా ప్రభుత్వం వద్దకు చేరుకోలేదు. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

84 ఏళ్ల భిడే అలియాస్ భిడే గురూజీ తొలి నుంచీ వివాదాస్పద నేత. మేవార్ సైన్యానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన దళితులపై దాడి చేసిన కేసులో భిడేతోపాటు రైట్ వింగ్‌కు చెందిన మరో నేత మిలింద్ ఎక్బోటేపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సంగ్లి జిల్లాలోని మిరాజ్-సంగ్లిలో జరిగిన గణపతి నిమజ్జనోత్సవంలో మత ఘర్షణలు రేకెత్తించారంటూ భిడేపై మరో కేసు కూడా ఉంది.

2008లో ‘జోధా-అక్బర్’ సినిమా విడుదలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో థియేటర్లను దోచుకున్న కేసు కూడా అతడిపై నమోదైంది. ఇన్ని కేసులు ఉన్న ఓ నిందితుడిని ‘పద్మశ్రీ’ పౌర పురస్కారానికి సిఫారసు చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News