Vijayawada: 'స్వచ్ఛశక్తి' కార్యక్రమం: చెంబులు చేతపట్టి రోడ్లపైకి వచ్చిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు!

  • 8 వరకూ 'స్వచ్ఛశక్తి'
  • చెంబులతో ఊరేగింపు చేస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన
  • ఆపై రోజుకో కార్యక్రమం

ఈ నెల 8వ తేదీ వరకు జరుగుతున్న 'స్వచ్ఛశక్తి' కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం విజయవాడ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు చెంబు యాత్ర చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత పెరిగేలా అవగాహన కల్పించడంతో పాటు, కార్యాలయాలను శుభ్రం చేసేందుకు నడుం బిగించారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి ప్రాంతాల్లో చెంబు యాత్ర నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగీ, చేత్తో చెంబు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు.

 కాగా, 'స్వచ్ఛశక్తి'లో భాగంగా రేపు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో విశిష్ట సేవలను అందించిన వారికి బహుమతులు అందించనున్నారు. ఆపై నాలుగో తేదీన స్వచ్ఛతా నేపథ్యం కలిగిన చలన చిత్రాలను ప్రదర్శించాలని, ఐదో తేదీ నుంచి రెండు రోజుల పాటు అన్ని పాఠశాలలకూ వెళ్లి, పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏడో తేదీన ఓడీఎఫ్‌ గా ప్రకటించిన గ్రామాల్లో మహిళా సర్పంచ్‌ లకు విజ్ఞానయాత్ర, ఎనిమిదో తేదీన 'స్వచ్ఛ శక్తి' వేడుకలతో కార్యక్రమాలు ముగుస్తాయి.

More Telugu News