srikanth: 'ఖడ్గం' నిర్మాత నన్ను వద్దన్నారు .. కృష్ణవంశీ మాత్రం వినిపించుకోలేదు!: శ్రీకాంత్

  • 'ఖడ్గం'లో నాకు ఛాన్స్ దక్కేది కాదు
  • నిర్మాత నన్ను ఒప్పుకోలేదు 
  • కృష్ణవంశీ తన పట్టు వదల్లేదు  

చిత్రపరిశ్రమకి సంబంధించిన ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి .. అంచలంచెలుగా ఎదిగిన కథానాయకులలో ఒకరిగా శ్రీకాంత్ కనిపిస్తాడు. అలాంటి శ్రీకాంత్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. తనకి ఎదురైన అనుభవాలలో ఒక దానిని గురించి ప్రస్తావించాడు. " ఒక రోజున కృష్ణవంశీ మా అందరికీ 'ఖడ్గం' సినిమా కథను చెబుతున్నాడు. అదే సమయంలో నిర్మాత అక్కడికి వచ్చాడు. 'శ్రీకాంత్ కి ఫ్యామిలీ హీరోగా మంచి పేరుంది .. ఈ సినిమాలో ఎమోషనల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకి ఆయన సరిపోడు' అని కృష్ణవంశీతో అన్నాడు.

ఆ తరువాత నా వైపు తిరిగి 'శ్రీకాంత్ నువ్వేమీ అనుకోకు .. ఈపాత్రకి నువ్వు సరిపోవు' అని చెప్పాడు. 'ఫర్లేదు సార్ .. కుదిరితేనే చేస్తాను .. లేదంటే లేదు' అనేశాను నేను. 'శ్రీకాంత్ కాకుండా మరో హీరోను పెట్టుకుంటే ఇంకో రెండు కోట్లు పెట్టడానికి నేను సిద్ధంగా వున్నాను' అని కృష్ణవంశీతో నిర్మాత అన్నాడు. 'అయితే నువ్వు ఈ సినిమా చెయ్యొద్దు .. నాకు వేరే నిర్మాతలు వున్నారు' అని కృష్ణవంశీ ఆయనతో తేల్చి చెప్పేశాడు .. నా మీద కృష్ణవంశీ అంతటి నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే ' అని అన్నాడు.       

More Telugu News