psycho shankar: 30 అత్యాచారాలు... 15 హత్యలు... గడగడలాడించిన సైకో శంకర్ కథ ఆత్మహత్యతో ముగిసింది!

  • బెంగళూరు జైల్లో ఆత్మహత్య
  • బ్లేడుతో గొంతు కోసుకుని అఘాయిత్యం
  • ఊపిరి పీల్చుకున్న కర్ణాటక, తమిళనాడు వాసులు

కరుడుగట్టిన నేరగాడు, మహిళలపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడ్డ సైకో శంకర్ (41) కథ ముగిసింది. బెంగళూరు శివార్లలో పరప్పన అగ్రహార జైలులో ఖైదీగా ఉన్న అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో ఇతడు 30 మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. 15 మందిని హత్య చేశాడు. బెంగళూరు జైలులో బ్లేడ్ తో గొంతు కోసుకుని రక్తపు మడుగులో పడి ఉండగా తోటి ఖైదీలు చూసి అధికారులకు సమాచారం అందించారు. శంకర్ ను విక్టోరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు తేల్చారు.

బెంగళూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇతడు గతంలో రెండు సార్లు తప్పించుకుపోయాడు. సినిమాల్లో సీన్లను తలపిస్తూ వెదురు బొంగు, బెడ్ షీటు సాయంతో ఎత్తైన గోడల పై నుంచి దూకి పారిపోయాడు. తిరిగి పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సైకో శంకర్ మరణంపై విచారణకు అధికారులు ఆదేశించారు. బార్బర్ నుంచి బ్లేడ్ ముక్కను కొట్టేసి శంకర్ తన షర్ట్ లో కనిపించకుండా దాచి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడికి దగ్గర్లో కన్నియం పట్టి శంకర్ స్వగ్రామం.

More Telugu News