jayendra saraswathi: భౌతికంగా లేకపోయినా.. అందరి గుండెల్లో ఎప్పటికీ ఉంటారు: జయేంద్ర సరస్వతి మృతి పట్ల మోదీ, చంద్రబాబు, కేసీఆర్, జగన్

  • ఉదయం పరమపదించిన జయేంద్ర సరస్వతి 
  • విచారం వ్యక్తం చేసిన మోదీ, చంద్రబాబు, కేసీఆర్, జగన్
  • కలకాలం గుండెల్లో నిలిచిపోతారంటూ ట్వీట్స్

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ ఉదయం పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సమాజం కోసం జయేంద్ర సరస్వతి ఎంతో చేశారని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. పేద ప్రజల జీవితాలను మార్చడం కోసం ఎన్నో సంస్థలను నెలకొల్పారని చెప్పారు. ఆయన మరణ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ... లక్షలాది మంది గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు.
జయేంద్ర సరస్వతి నిర్యాణం ఆయన భక్తులకు తీరని లోటు అని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జయేంద్ర సరస్వతి మృతి విచారకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కంచి పీఠం అభివృద్ధికి, విద్యావికాసానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

జయేంద్ర సరస్వతి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కంచి పీఠం అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

జీవితంలో ధార్మికత, ఆధ్యాత్మిక చింతన, అత్యున్నత విలువలను ఆచరించి, ఇతరులకు ప్రబోధించారంటూ జయేంద్ర సరస్వతిని వైసీపీ అధినేత జగన్ గుర్తు చేేసుకున్నారు. ఆయన శివైక్యం చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. జగద్గురువుగా ఆయన ఖ్యాతి పొందారని చెప్పారు. జయేంద్ర సరస్వతి సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు.

  • Loading...

More Telugu News