Amar singh: శ్రీదేవికి అప్పులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ లేవు: తేల్చిచెప్పిన అమర్ సింగ్

  • శ్రీదేవి చనిపోయిన విషయాన్ని తొలుత బోనీ కపూర్ నాతోనే చెప్పారు
  • వదిన చనిపోయిందని చెప్పడంతో షాక్‌కు గురయ్యా
  • దురదృష్టకర ఘటన: అమర్ సింగ్

శ్రీదేవి చనిపోయిన విషయం తనకు బోనీ కపూర్ స్వయంగా ఫోన్ చేసి చెప్పారని సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్ తెలిపారు. శనివారం రాత్రి బోనీ తనకు ఫోన్ చేశారని, వదిన చనిపోయిందని చెప్పారని పేర్కొన్నారు. శ్రీదేవి చనిపోయిన విషయం బహుశా తొలుత తనకే ఫోన్ చేసి చెప్పి ఉంటారన్నారు. బోనీ ఆ మాట చెప్పాక నోట మాటరాలేదని, షాక్‌కు గురయ్యానన్నారు. శ్రీదేవికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, తనకు అప్పుల బాధలు కూడా లేవని పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, నిజంగా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

అమర్‌సింగ్, శ్రీదేవి కుటుంబాలకు ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. అమర్‌సింగ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా శ్రీదేవి కుటుంబం ఉండాల్సిందే. ఇరు కుటుంబాల మధ్య అంత స్నేహబంధం ఉంది. శ్రీదేవి మరణవార్త తెలిసినప్పుడు ఆయన షాక్‌కు గురయ్యారు. కాగా, దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారుల అనుమతి అనంతరం ప్రత్యేక విమానంలో శ్రీదేవి పార్థివ దేహాన్ని ముంబై తరలించారు. అభిమానుల సందర్శనార్థం సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆమె భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

More Telugu News