Sridevi: శ్రీదేవిని కడసారి చూసేందుకు భారీగా తరలివస్తున్న అభిమానులు

  • గతరాత్రి ముంబై చేరుకున్న శ్రీదేవి పార్థివదేహం
  • మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం
  • కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమానులు

ప్రముఖ సినీ నటి శ్రీదేవికి కడసారి నివాళులర్పించేందుకు అభిమానులు, పలువురు ప్రముఖులు ముంబైలోని ఆమె నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. గత రాత్రి దుబాయ్ నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్న శ్రీదేవి భౌతిక కాయాన్ని నగరంలోని లోఖండ్‌వాలా గ్రీన్  ఏకర్స్‌లోని ఆమె నివాసానికి తరలించారు.

ఈ ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇందుకోసం ఆమె భౌతిక కాయాన్ని ఉదయం 9 గంటలకు గ్రీన్ ఏకర్స్ నుంచి సెలెబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌కు తరలిస్తారు. శ్రీదేవి పార్థివదేహం నగరానికి చేరుకున్న విషయం తెలిసి కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అభిమానుల రాకతో ఆమె ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే సేవా సమాజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీదేవి అంత్యక్రియలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

More Telugu News