Sridevi: గంటలతరబడి బోనీ కపూర్ ని విచారించిన దుబాయ్ పోలీసులు?

  • మూడున్నర గంటల పాటు విచారించిన పోలీసులు
  • విచారణలో పాల్గొన్న నలుగురు పోలీస్ అధికారులు
  • బోనీతో పాటు ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల విచారణ

ప్రముఖ నటి శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి, మునిగి మరణించినట్టు దుబాయ్ ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దుబాయ్ పోలీసులు వివరాలు నమోదు చేసుకునే నిమిత్తం శ్రీదేవి భర్త బోనీకపూర్ ను మూడున్నర గంటల పాటు విచారించినట్టు ‘పీపింగ్ మూన్. కామ్’ అనే వెబ్ సైట్ వెల్లడించింది.

ఈ విచారణలో నలుగురు పోలీస్ అధికారులు పాల్గొన్నారని, బోనీ కపూర్ తెలిపిన వివరాలను వారు రికార్డు చేసుకున్నారని ఆ వెబ్ సైట్ కథనం. బోనీతో పాటు ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను కూడా విచారించిన పోలీసులు, వారి సమాచారాన్ని కూడా రికార్డు చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, శ్రీదేవి స్పృహ కోల్పోయాక సమీపంలో ఉన్న రషీద్ ఆసుపత్రికి తరలించారు. అయితే, శ్రీదేవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్టు నిర్థారించారు. శవ పరీక్ష అనంతరం, ఇధ్దరు వైద్యులు, ఆసుపత్రిలోని మరో ఐదుగురు అటెండెంట్ల వివరణనూ పోలీసులు సేకరించారని ‘పీపింగ్ మూన్. కామ్’ కథనంగా ఉంది.

More Telugu News