PT Usha: ఆర్థిక సాయం కోసం పరుగుల రారాణి పీటీ ఉష వినతి!

  • ఉష స్కూల్ నిర్వహణకు సాయం కోసం ట్విట్టర్ సందేశం
  • పేద బాలికలకు ఉచితంగా శిక్షణ
  • ఏషియాడ్, ఒలింపిక్స్ పోటీలే లక్ష్యంగా కృషి

ఒకప్పుడు పరుగుల రారాణిగా పేరొందిన మాజీ అథ్లెట్ పీటీ ఉష ప్రస్తుతం పేద స్ప్రింటర్ల కోసం ఓ స్కూల్‌ నడుపుతున్నారు. దాని నిర్వహణ కోసం ఆమె ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉష స్కూల్‌కు సాయం చేయాలంటూ ఆమె ట్విట్టర్‌లో ఓ వీడియో సందేశంలో కోరారు. స్కూల్‌లో ప్రస్తుతం వెయ్యి మంది ఉన్నారని, అయితే స్కూల్‌కి సంబంధించిన అన్ని రకాల పనులు ఇంకా పూర్తి కాలేదని ఆమె అన్నారు. తాము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నామని చెప్పారు. అయితే మరింత కృషి చేయాలని, తమకు మరింత పెట్టుబడులు కూడా అవసరమని ఆమె తన సందేశంలో తెలిపారు.

ఏసియాడ్, ఒలింపిక్స్‌లకు అద్భుతమైన స్ప్రింటర్లను తయారు చేసే లక్ష్యంతో పీటీ ఉష 2002లో కేరళలోని కోజీకోడ్‌లో తన పేరుమీదే ఓ స్కూల్‌ను నెలకొల్పారు. ఇందులో పేద బాలికలకు ఉచితంగా శిక్షణ, ఆహారం, వసతి ఏర్పాట్లు కల్పిస్తారు. గతేడాది వరకు ఈ  స్కూల్ ప్రభుత్వ గ్రాంట్లు, సంస్థలు, కొంత మంది దాతల విరాళాలతో నడిచింది. అయితే ఇప్పుడు నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆమె సోషల్ మీడియా ద్వారా అశేష అభిమానులకు, దాతలకు, సహృదయులకు ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి చేశారు. క్రీడలకు ఆమె చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ, అర్జున అవార్డులను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News