Indian Railway: రైళ్లలో వ్యాక్యూమ్ టాయిలెట్లు.. 500 కోచ్‌లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు

  • రైళ్లలో విమాన తరహా టాయిలెట్లు
  • ప్రయోగాత్మకంగా 500 కోచ్‌లలో ఏర్పాటు
  • దశల వారీగా విస్తరణ

రైళ్లలోని టాయిలెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోంచి వచ్చే దుర్గంధం రైలు ప్రయాణాన్ని నరకప్రాయంగా మారుస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం నడుంబిగించిన రైల్వేశాఖ.. విమానాల్లో ఉపయోగించే వ్యాక్యూమ్ టాయిలెట్ల వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలుత 500 కోచ్‌లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ విధానం విజయవంతం అయితే అన్ని రైళ్లలోనూ ఏర్పాటు చేస్తారు.

నిన్నమొన్నటి వరకు రైళ్లలో సాధారణ టాయిలెట్లు ఉండగా, వాటి స్థానంలో బయో టాయిలెట్లను తీసుకొచ్చారు. అయితే ఇవి కూడా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. సాధారణ టాయిలెట్ల కంటే ఇవి మరింత దుర్గంధంగా మారుతున్నాయి. ప్రయాణికుల్లో అవగాహన లేమి వల్ల కమోడ్‌లో సీసాలు, న్యాప్‌కిన్‌లు వేస్తుండడం వల్ల ఇవి మూసుకుపోతున్నాయి. దీంతో వీటికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించిన రైల్వే.. వ్యాక్యూమ్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రైల్వే బోర్డు చైర్మన్‌గా అశ్వనీ లోహానీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యాక్యూమ్ టాయిలెట్లపై నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.

More Telugu News