tiruvanantapuram: ఇంట్లోంచి పారిపోయిన యువకుడు... జూలోని సింహాల ఎన్ క్లోజర్ లో దొరికాడు... వీడియో చూడండి

  • తిరువనంతపురం జూలోని సింహాల ఎన్ క్లోజర్ లోకి దూకిన యువకుడు 
  • అది చూసిన సందర్శకుల అరుపులు 
  • అప్రమత్తమై సింహాన్ని లోపలికి పంపి, మురుగన్ ను రక్షించిన సిబ్బంది

2016లో హైదరాబాదులోని నెహ్రూ జులాజికల్ పార్కులో చోటుచేసుకున్న ఓ ఘటన తాజాగా తిరువనంతపురంలో పునరావృతమైంది. నెహ్రూ జూలో పులుల ఎన్ క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకి ప్రాణాలు కోల్పోగా, తాజాగా సింహం ఎన్ క్లోజర్ లోకి దూకి ప్రాణాలతో బతికి బట్టకట్టాడో వ్యక్తి.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... కేరళలోని ఒట్టప్పలం ప్రాంతానికి చెందిన మురుగన్‌(33) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. నిన్న జూను సందర్శించేందుకు టికెట్ తీసుకుని జూలోకి వెళ్లాడు. నేరుగా జూలోని సింహం ఉండే ఎన్ క్లోజర్ దగ్గరకు వెళ్లి రక్షణగా ఉన్న ఇనుపకంచెను ఎక్కి అందులోకి దూకేశాడు. ఆ సమయంలో రెండేళ్ల వయస్సు కలిగిన ఆడసింహం అక్కడికి కొన్ని అడుగుల దూరంలో తిరుగుతోంది.

సింహం తనను చూడలేదనుకున్నాడేమో కానీ, మోకాళ్లపై నడుచుకుంటూ సింహం దగ్గరకి వెళ్లే ప్రయత్నం చేశాడు. దీనిని చూసిన సందర్శకులు అతనిని నిలువరించేందుకు కేకలు వేశారు. వారి కేకలు విన్న భద్రతా సిబ్బంది వేగంగా అప్రమత్తమయ్యారు. ఒక గార్డు సింహాన్ని బోనులోకి పంపగా, సింహం దిశగా వెళ్తున్న మురుగన్ ను నలుగురు సిబ్బంది పట్టుకుని బయటకు తీసుకొచ్చి, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.   

More Telugu News