Tollywood: విజయవాడలో నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తల దాడి!

  • విజయవాడలో ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో చర్చ
  • బీజేపీని తూర్పారబట్టిన శివాజీ
  • సంయమనం కోల్పోయిన బీజేపీ కార్యకర్తలు
  • శివాజీపై దాడిని అడ్డుకున్న ప్రజాసంఘాలు

ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చర్చలు సాగుతున్న వేళ విజయవాడలో జరిగిన చర్చలో పాల్గొన్న సినీ నటుడు శివాజీపై దాడి జరిగింది. ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలో హోదాపై ఆయన ప్రసంగిస్తుండగా, ఒక్కసారిగా దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై భౌతికదాడికి దిగారు. హోదా కోసం ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్న వేళ, అక్కడే ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తల్లో అసహనం పెరగడంతో ఈ ఘటన జరిగింది.

 అంతకుముందు శివాజీ మాట్లాడుతూ, బీజేపీ వైఖరిని తూర్పారబట్టాడు. "మోదీ జీరో... మోదీ జీరో" అంటూ శివాజీ నినాదాలు చేశారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు కల్పించుకుని "శివాజీ డౌన్ డౌన్" అని నినాదాలు చేశారు. శివాజీ ఆగ్రహంతో ప్రజలు మిమ్మల్ని ఇంకా మాట్లాడనిస్తున్నారు. ఇంకా ఇదే పరిస్థితి ఉంటే తరిమి కొడతారని హెచ్చరించారు. ఆపై బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా శివాజీపై పడటంతో, అక్కడే ఉన్న ప్రజా సంఘాలు, ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మ వ్యాఖ్యానించడంతో ఆమెపైనా దాడి ప్రయత్నం జరిగింది.

More Telugu News