sudhakar maharaj: సుధాకర్ మహరాజ్ ఘనుడే... 250 మంది భక్తుల నుంచి 3 కోట్లు పిండేశారు

  • మహాయాగం పేరుతో బురిడీ కొట్టించిన సుధాకర్ మహరాజ్
  • మహాభక్తుల నుంచి మహాయాగానికి 10 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వసూళ్లు
  • 250 మంది వరకు మోసపోయి ఉంటారని అంచనా

నెల్లూరులో భక్తి పేరుతో సుధాకర్‌ మహరాజ్‌ బృందం 250 మందిని బురిడీ కొట్టించి 3 కోట్ల రూపాయల వరకు దండుకున్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. స్వామీజీ బాధితుల సంఖ్య ఇంకా పెరగవచ్చని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. మహాయాగం పేరుతో భక్తులకు పుస్తకాలు విక్రయించి కోట్ల రూపాయలు వసూలు చేసిన సుధాకర్‌ బాబా లీల నాలుగు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మోసం బయటపడగానే ఆత్మహత్యాయత్నం చేసిన బాబా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మహాయాగం పుస్తకాల కొనుగోలు చేసి మోసపోయిన బాధితుల్లో అప్పులు చేసి వారు, బంగారు ఆభరణాలు, తాళిబొట్లు తాకట్టు పెట్టిన వారు, భర్తలకు తెలియకుండా దాచుకున్న డబ్బులు దోచిపెట్టిన వారు, చీటీలు పాడిన వారు మరికొందరు, ఇళ్లలో దాచిన నగదును యాగం పాలు చేసిన వారు మరి కొందరు ఉన్నారని పలువురు వాపోతున్నారు.

భారీ మొత్తంలో నగదు చెల్లించి మరీ మహాయాగంలో పాల్గొన్న పలువురు సమాజంలో సంపాదించుకున్న పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. మహాయాగ నిర్వహణకు పలువురు భక్తులు పది లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. 

More Telugu News