Anisha Chowdary: పాత స్నేహితుడు, కొత్త మిత్రుడి మధ్య నలిగిపోయిన అనీషా... అపోహతోనే ఆత్మహత్య!

  • అనంతపురంలో అనీషాకు స్నేహితుడు.. 21న అతని పెళ్లి
  • పెళ్లికి వెళితే దీక్షిత్ ఏమనుకుంటాడోనని అపోహ
  • బాయ్ ఫ్రెండ్ కు 350 మెసేజ్ లు పెట్టిన అనీషా
  • దీక్షిత్ తప్పు లేదంటున్న పోలీసు వర్గాలు

పాత స్నేహితుడి పెళ్లికి వెళితే కొత్త స్నేహితుడు తప్పుగా భావించి తనకు దూరం అవుతాడేమోనన్న అపోహతోనే హైదరాబాద్ శివశివానీ కాలేజీ హాస్టల్ లో అనీషా చౌదరి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఎంబీఏ చదువుతున్న అనీషా రెండు రోజుల క్రితం తన స్నేహితుడు దీక్షిత్ పటేల్ తో వీడియోకాల్ లో మాట్లాడుతూ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు 350కి పైగా వాట్స్ యాప్ సందేశాలను ఆమె తన స్నేహితుడికి పంపిందని కూడా పోలీసులు గుర్తించారు. ఇక అనీషాకు చాలా త్వరగా కోపం వచ్చేదని, నచ్చితే అంతే స్థాయిలో ప్రేమను చూపేదని కాలేజీలో ఆమె స్నేహితులు చెబుతున్నారు.

అనంతపూర్ లో అనీషాకు ఓ స్నేహితుడు ఉండేవాడని, అతని గురించి దీక్షిత్ కు స్వయంగా చెప్పిన తరువాత, ఆమెలో కొత్త అపోహలు మొదలయ్యాయని భావిస్తున్నామని, అదే ఆత్మహత్యకు పురికొల్పి ఉండవచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ నెల 21న అనంతపురంలో అతని వివాహం ఉండగా, దానికి వెళ్లి వస్తానని అనీషా, దీక్షిత్ నుంచి అనుమతి కూడా తీసుకుందని, అయినప్పటికీ, అతను ఏమైనా అనుకుంటాడేమోనని తీవ్ర ఆందోళనలో పడిపోయిందని తెలిపారు.

స్నేహితురాలు ఇంటికి వెళ్లడంతో ఒంటరిగా గదిలో ఉండిపోయిన అనీషా, 16వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకూ దాదాపు 350 మెసేజ్ లు చేసిందని, వీటన్నింటితో పాటు వీడియో కాల్ సంభాషణనూ విశ్లేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీక్షిత్ నుంచి అనీషాపై ఎటువంటి ఒత్తిడి లేదని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలిపారు.

More Telugu News