Uttar Pradesh: విషాదం! సాయంత్రమే పెళ్లి.. ఉదయం ప్రాణాలు తీసిన సెల్‌ఫోన్!

  • ఫోన్లో మాట్లాడుతూ  ఏమరపాటుగా వ్యవహరించిన యువకుడు
  • పట్టాలు దాటుతుండగా ఢీకొన్న రైలు
  • రెండు కుటుంబాల్లో విషాదం

సాయంత్రం పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువ ఇంజినీరును సెల్‌ఫోన్ ప్రాణాలు తీసింది. మరికొన్ని గంటల్లో కొత్త జీవితంలోకి ప్రవేశించబోతున్న ఆ యువకుడు సెల్‌ఫోన్‌లో స్నేహితులతో మాట్లాడుతూ పెళ్లికి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నాడు. మరో సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు పంపుతూ రైల్వే ట్రాక్ దాటుతుండగా దారుణం జరిగిపోయింది. చిన్నపాటి ఏమరపాటు అతడి శరీరాన్ని ఛిద్రం చేసింది. పట్టాలు దాటుతున్న యువకుడిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే విగతజీవుడయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. నందోసీ గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30) ఇంజినీరు. ఇటీవల వివాహం నిశ్చయమవగా సోమవారం సాయంత్రం వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లికి స్నేహితులను ఆహ్వానించడంతోపాటు పెళ్లి పనులకు సంబంధించి సెల్‌ఫోన్లో మాట్లాడుతూ బజారుకు బయలుదేరాడు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఫోన్లో మాట్లాడుతూ ఏమరపాటుగా వ్యవహరించడం వల్ల దూసుకొస్తున్న రైలును గమనించలేకపోయాడు. దీంతో క్షణకాలంలోనే జరగరానిది జరిగిపోయింది.

నరేశ్ మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పెళ్లి కూతురును ఊరడించడం ఎవరి తరమూ కావడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News