Congress: సంచలనం: నీరవ్ మోదీ నుంచి కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి సతీమణికి రూ.1.5 కోట్ల విలువైన రత్నాలు!

  • చిక్కుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత
  • నీరవ్ మోదీ నుంచి కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు
  • పక్కా ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధికారులు?
  • ఆరోపణలు అవాస్తవమన్న అభిషేక్ సింఘ్వి

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)ని నిండా ముంచేసిన నీరవ్ మోదీ వ్యవహారంలో మరో సంచలన విషయం బయటపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి సతీమణి అనితా సింఘ్వికి నీరవ్ మోదీ నుంచి రూ.1.5 కోట్ల విలువైన రత్నాలు అందినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే, ఈ ఆరోపణలను అభిషేక్ కొట్టిపడేశారు. అందులో ఇసుమంతైనా వాస్తవం లేదన్నారు.

మే 20, 2014, ఆగస్టు 21, 2014, జనవరి 17, 2015లో అనిత సింఘ్వి కోట్ల రూపాయల విలువైన రత్నాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ట్యాక్స్ ఇన్వాయిస్‌లో అనితా సింఘ్వి పాన్ నంబరును ఉపయోగించడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని ఇస్తోంది. ఈ మొత్తం లావాదేవీలను చెక్ ద్వారా నిర్వహించినట్టు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ మొత్తం లావాదేవీలను నీరవ్ మోదీ తన డైరీలో, ఆయన సిబ్బంది నిర్వహిస్తున్న కంప్యూటర్లలో ‘లెక్కల్లోకి తీసుకోని పేమెంట్’గా పేర్కొనడం. ఇలా మొత్తం రూ.4.8 కోట్లు లెక్కలేని చెల్లింపుల జాబితాలో ఉన్నట్టు బయటపడింది.

ఈ ఆరోపణలపై అభిషేక్ స్పందిస్తూ.. తన భార్య నగలు కొన్నట్టు తన దృష్టికి రాలేదన్నారు. అయితే ఆమె కొన్నట్టు ఎవరి కంప్యూటర్‌లోనే ఆధారాలు ఉన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి నిజమే అయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అయితే అది ఎటువంటి స్టేట్‌మెంటో తనకు తెలియదని, తొలిసారి దీని గురించి వింటున్నానని పేర్కొన్నారు. తనపై బురద జల్లేందుకు కావాలనే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తోందని అన్నారు.

More Telugu News