Pawan Kalyan: టీడీపీ, వైసీపీలను కూడా పిలిచా... ఎందుకు రాలేదో మరి: పవన్ కల్యాణ్

  • సమావేశానికి అధికార పక్షానికి కూడా ఆహ్వానం
  • ప్రధాన ప్రతిపక్షం వైసీపీని కూడా పిలిచాను
  • వారి పంథాలో వారు పోరాడుతున్నారు
  • సమావేశాల తరువాత సబ్ కమిటీల ఏర్పాటు

నేడు తాను చేపట్టిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశానికి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కూడా ఆహ్వానించానని, కానీ వారు రాలేదని, అందుకు కారణాలు తనకు తెలియవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ కు వచ్చిన ఆయన, కమిటీ సమావేశం ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏపీకి విభజన హామీల అమలు విషయంలో టీడీపీ, వైకాపా నేతలు వాళ్ల పంథాలో పోరాడుతూనే ఉన్నారని అన్నారు. జేఎఫ్సీ సమావేశాలు తరచుగా కొనసాగుతాయని, ఈ భేటీ తరువాత సబ్ కమిటీలను వేసే ఆలోచనలో ఉన్నామని కూడా పవన్ తెలియజేశారు. చాలామంది జేఎఫ్సీతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. కాగా, జేఎఫ్సీ తొలి సమావేశానికి జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్, చలసాని శ్రీనివాస్, పద్మనాభయ్య, కొణతాల రామకృష్ణ, సీపీఐ నుంచి రామకృష్ణ, సీపీఎం నుంచి మధు, కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు, గౌతమ్ తదితరులు హాజరయ్యారు.

More Telugu News