Jana Sena: రేపు ట్యాంక్‌ బండ్‌ వద్ద అంబేద్కర్‌కి నివాళులర్పించి.. జేఎఫ్‌సీ భేటీకి బయలుదేరనున్న పవన్ కల్యాణ్

  • హైద‌రాబాద్ లోని ద‌స‌ప‌ల్లా హోట‌ల్ లో భేటీ
  • రేపు మ‌ధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం
  • ఎల్లుండి కూడా కొనసాగనున్న భేటీ

జేఎఫ్సీ కోసం రేపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నిర్వ‌హించ‌నున్న స‌మావేశంపై జన‌సేన ఉపాధ్య‌క్షుడు బీ మ‌హేంద‌ర్ రెడ్డి పేరిట ఈ రోజు పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టంలో క‌ల్పించిన హామీల అమ‌లుపై కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తోన్న ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌క‌ట‌న‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల్లో గంద‌రగోళం ఏర్ప‌డ‌డంతో వాస్త‌వాల‌ను ధ్రువీక‌రించ‌డానికి ఏర్పాటైన జేఎఫ్సీ సమావేశాన్ని తొలిసారిగా రేపు హైద‌రాబాద్ లోని ద‌స‌ప‌ల్లా హోట‌ల్ లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

రేపు మ‌ధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుందని తెలిపారు. ఈ సమావేశం ఎల్లుండి కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. రేపు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, అంజలి ఘటించి పవన్ కల్యాణ్ జేఎఫ్సీ సమావేశానికి వెళతారని అందులో పేర్కొన్నారు.          

More Telugu News