Chandrababu: చంద్రబాబు విషయంలో బీజేపీకి ఈ భయం ఉండవచ్చు: జేసీ

  • దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర చంద్రబాబుది
  • మళ్లీ అలాంటిది జరగవచ్చనే భయం బీజేపీలో ఉండవచ్చు
  • టీడీపీ కేంద్రమంత్రుల రాజీనామాలతో ఒరిగేదేమీ ఉండదు

ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారని... థర్డ్ ఫ్రంట్ లో ఆయన కీలకంగా ఉన్నారని, ప్రధానమంత్రులను తయారు చేశారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. మళ్లీ అలాంటివి జరగవచ్చనే భయం బీజేపీకి ఉండవచ్చని అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయి కంటే ఉన్నత స్థాయికి చంద్రబాబు వెళ్లాలని సాక్షాత్తు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలాంటి వ్యక్తే కోరుతున్నారని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ సహా అన్ని జాతీయ పార్టీల మద్దతును తాము కోరామని అన్నారు.

ప్యాకేజీ పేరుతో ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందన్న నమ్మకం తనకు లేదని జేసీ స్పష్టం చేశారు. జగన్ తన ఎంపీలతో ఏప్రిల్ లో రాజీనామాలు చేయించినంత మాత్రాన ఆయా స్థానాలకు ఉపఎన్నికలు జరగవని... తక్షణమే రాజీనామాలు చేయిస్తే ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండబోదని... వీళ్ల స్థానంలో బీజేపీ వాళ్లకు కేంద్ర మంత్రులుగా మోదీ అవకాశం కల్పిస్తారని తెలిపారు. 

More Telugu News