Facebook: బోర్ కొట్టిస్తున్న ఫేస్ బుక్... 'టాటా' చెప్పేస్తున్న యూత్!

  • ఫేస్ బుక్ ను వీడుతున్న 25 ఏళ్లలోపు యూత్
  • స్నాప్ చాట్ కు పెరుగుతున్న ఆదరణ
  • వెల్లడించిన 'ఇమార్కెటర్' రిపోర్టు

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది ఖాతాదారులను కలిగివున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఫేస్ బుక్ ను వాడుతున్న యూత్ నెమ్మదిగా ముఖం చాటేస్తున్నారు. కొత్తగా వచ్చిన స్నాప్ చాట్, ఇన్ స్టాగ్రామ్ లను ఆశ్రయిస్తున్నారు. యువ ఖాతాదారులు (25 ఏళ్లలోపు వారు) వైదొలగుతుండగా, పెద్దలు మాత్రమే మిగులుతున్నట్టు ఓ ఆన్ లైన్ సర్వే వెల్లడించింది. 18 నుంచి 24 ఏళ్ల వయసువారిలో 5.8 శాతం మంది ఫేస్ బుక్ ను వదిలేశారని 'ఇమార్కెటర్' రిపోర్టు పేర్కొంది. ముఖ్యంగా అమెరికాలో ఫేస్ బుక్ ను ఈ సమస్య బాధిస్తోందని తెలిపింది.

12 నుంచి 17 సంవత్సరాల వయసువారిలో దాదాపు 6 శాతం మంది, 12 ఏళ్లలోపు వారిలో 9.3 శాతం మంది ఫేస్ బుక్ కు టాటా చెప్పారని తెలిపింది. తదుపరి రెండు మూడేళ్ల వ్యవధిలో 25 ఏళ్లలోపున్న ఖాతాదారుల్లో 20 లక్షల మందిని ఫేస్ బుక్ దూరం చేసుకోనుందని అంచనా వేసింది. ఇదే సమయంలో స్నాప్ చాట్ కు 19 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ కు 18 లక్షల మంది కొత్త ఖాతాదారులు రానున్నారని తెలిపింది. 24 గంటల తరువాత సందేశం అదృశ్యమయ్యే స్నాప్ చాట్ యూత్ లో బాగా పాప్యులర్ అయిందని 'ఇమార్కెటర్' అనలిస్ట్ డెబ్రా అహో విలియంసన్ వెల్లడించారు. కాగా, ప్రస్తుతం యూఎస్ లో ఫేస్ బుక్ కు 16.95 కోట్లు, ఇన్ స్టాగ్రామ్ కు 10.47 కోట్లు, స్నాప్ చాట్ కు 8.65 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు.

More Telugu News