KTR: ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు వచ్చేలా కొత్త విధానం: మంత్రి కేటీఆర్‌

  • టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కేటీఆర్‌ సమావేశం
  • స్టేట్ యూనిఫైడ్ రూల్స్ ని తీసుకు వచ్చాం
  • సాధారణ పౌరుడికి అత్యంత పారదర్శకంగా సేవలు
  • 21 రోజుల్లో అన్ని అనుమతులు వచ్చేలా చేశాం

రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందితో తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌ సమావేశం అయ్యారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీర్స్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ డీటీసీపీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు హజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత‌ ప్రజలు ప్రభుత్వం నుంచి సరికొత్త పాలన ఆశించారని, ఆ దిశగా అనేక పాలనా సంస్కరణలతో ముందుకు వెళుతున్నామ‌ని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

అందులో భాగంగానే స్టేట్ యూనిఫైడ్ రూల్స్ ని తీసుకు వచ్చామన్నారు. సాధారణ పౌరుడికి అత్యంత పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు వచ్చేలా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకుని వచ్చామని మంత్రి తెలిపారు. ఈ విధానంలో నెల రోజుల గడువును కుదించి 21 రోజుల్లో అన్ని అనుమతులు వచ్చేలా చేశామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం క‌ల్పిస్తున్నామ‌న్నారు. అనుమతుల ప్రక్రియలో ఉన్న అనవసర ఆలస్యాన్ని తగ్గించేందుకే ఈ విధానం తీసుకు వచ్చామని తెలిపారు.

డీపీఎమ్మెస్ విధానం పట్ల టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తి అవగాహన‌ పెంచుకోవాలని, సంపూర్ణ పరిజ్జానంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అధికార వ్యవస్థ‌కు మరింత పేరు తెచ్చేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలన్నారు. ప్రభుత్వం తెచ్చిన అన్ లైన్ విధానం పట్ల మంత్రి అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 21 రోజుల గడువు లోపల అనుమతులు ఇవ్వకుండా ఆలస్యం చేసే అధికారులపై టీఎస్ఐపాస్ లో మాదిరి పెనాల్టీలు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం అవుతామని మంత్రి తెలిపారు. క్రమబద్ధ‌మైన పురపాలనలో టౌన్, కంట్రీ ప్లానింగ్ అధికారుల పాత్ర కీలకమైనద‌ని, అధికారులకు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ముఖ్యంగా నూతనంగా ఎర్పాటైన జిల్లా కేంద్రాల్లో రోడ్ల విస్తరణ, అక్రమ కట్టడాలను అరికట్టడం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీంతో పాటు అన్ని పురపాలికల్లోని లే అవుట్లలోని ఖాళీ ప్రదేశాలు (ఓపెన్ ప్లాట్లు) ను కాపాడడంలో మున్సిపల్ కమిషనర్లతో కలిసి పనిచేయాలన్నారు.

అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్థానికంగా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులతోపాటు రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపైన వివరాలు అందించాలని సీడీఎంఏ శ్రీదేవి, డీటీసీపీ డైరెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తోన్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను కోరారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తమ విధుల్లో టెక్నాలజీ సహకారంతో విధులు నిర్వర్తించేందుకు అవసరమైన సూచనలివ్వాలన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు, సీడీఎంఏ, డీటీసీపీ అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News