Tamilnadu: జయలలిత మేనకోడలు దీప ఇంట నకిలీ ఐటీ దాడులు... దిమ్మతిరిగే వాస్తవం వెలుగులోకి!

  • ఇటీవల దీప ఇంట నకిలీ ఐటీ దాడులు
  • పోలీసులు వచ్చేలోగా జారుకున్న నకిలీ అధికారులు
  • దాడులకు సూత్రధారి దీప భర్త మాధవనే
  • పోలీసులకు పట్టుబడ్డ నకిలీ ఐటీ అధికారి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ఇంటిపై ఇటీవల నకిలీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీప ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు, విచారణలో భాగంగా దిమ్మతిరిగే వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. దీపను భయపెట్టేందుకు ఆమె భర్త మాధవన్‌ చేసిన ప్రయత్నమే ఈ నకిలీ ఐటీ దాడులని, ఓ అధికారిగా నటిస్తూ, సోదాలు జరిపి, ఆపై పోలీసులకు పట్టుబడిన వ్యక్తి విచారణలో చెప్పాడు. దీపను భయపెట్టడమే తమ ఉద్దేశమని ఆయన చెప్పినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.

 దీప ఇంటిపై అసలు ఐటీ అధికారుల దాడి జరగలేదని, సినిమా పక్కీలో నకిలీ ఆదాయపు పన్ను అధికారులు కార్లలో వచ్చి దాడుల డ్రామా ఆడిన సంగతి తెలిసిందే. వచ్చిన వారు అధికారులు కాదని దీప కుటుంబీకులకు అనుమానం రావడం, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు దీప ఇంటికి వెళ్లేలోగానే నకిలీ ఐటీ గ్యాంగ్ జారుకుంది. ఆమె వద్ద భారీగా డబ్బుంటుందని భావిస్తూ, సినిమాలో చూపే మాదిరిగా దోపిడీ చేయాలన్న ఉద్దేశంతోనే వారు వచ్చుంటారని తొలుత భావించిన పోలీసులు, తాజాగా నిందితుడు వెల్లడించిన నిజాలతో మాధవన్ పై కేసు నమోదుకు కదులుతున్నారు.

More Telugu News