kerala: కేరళ రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపుతున్న 9వ తరగతి బాలిక సెల్ఫీ వీడియో!

  • సీపీఎం నుంచి బీజేపీలోకి వెళ్లిన సుకుమారన్
  • బెదరింపులకు దిగిన సీపీఎం స్థానిక నేతలు
  • భయాందోళనతో సెల్ఫీ వీడియో పొస్టు చేసిన బాలిక

కేరళలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక సోషల్ మీడియాలో పోస్టు చేసిన సెల్ఫీ వీడియో ఒకటి పెను కలకలం రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... సీపీఎంకు మంచి పట్టున్న కసరగాడ్‌ జిల్లాకు చెందిన సుకుమారన్‌ అనే వ్యక్తి ఆ పార్టీని వీడి బీజేపీలోకి వలస వెళ్లారు. ఇది ఉప్పు-నిప్పులా ఉన్న బీజీపీ, సీపీఎం మధ్య కాకపుట్టించింది.

దీంతో ఆగ్రహానికి గురైన ఐదుగురు స్ధానిక సీపీఎం నేతలు, తన కుమార్తె అశ్విని (9వ తరగతి) ని స్కూల్ నుంచి ఇంటికి తెచ్చే సమయంలో సుకుమారన్ ను అడ్డుకున్నారు. పార్టీలోకి తిరిగి రావాలని ఆహ్వానించారు. రానిపక్షంలో తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. చంపేస్తామని బెదిరింపులకు కూడా దిగారు. తమనెవరూ ఏమీ చేయలేరని, తామెవరికీ భయపడే రకం కాదని వారు తెలిపారు.

 దీంతో బెదిరిపోయిన అశ్విని, జరిగినదంతా వివరిస్తూ, సీపీఎం కార్యకర్తలు తన తండ్రిని చంపేస్తారని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని, తాను కనీసం స్కూల్ కి వెళ్లాలన్నా భయపడుతున్నానని, దొడ్డి దారిన స్కూల్ కి వెల్లాల్సి వస్తోందని చెబుతూ, సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్టు చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు మద్దతు పలికారు.

దీనిపై స్పందించిన సీపీఎం నేతలు, సుకుమారన్ ఒక సాధారణ కార్యకర్త అని, తొలుత కాంగ్రెస్, తరువాత బీజేపీలో చేరాడని, అతనిని బెదిరించాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నిస్తున్నారు. సుకుమారనే పబ్లిసిటీ కోసం ఇలా చేయించి ఉంటాడని వారు అభిప్రాయపడ్డారు. బీజేపీ నేతలు దీనిపై స్పందిస్తూ, సుకుమారన్ బలమైన నేత అని, బెదిరింపులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. కాగా, దీనిపై సీఎం నివేదిక కోరారు. 

More Telugu News