Andhra Pradesh: పార్లమెంటులో ఏనాడైనా వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి నిరసన తెలిపారా?: సీఎం రమేశ్

  • పార్లమెంటులో రేపు కూడా ఆందోళన కొనసాగిస్తాం
  • ఏపీకి కేంద్రం నుంచి ప్రయోజనాలు అందకుండా వైసీపీ అడ్డు పడుతోంది
  • ఏపీకి ఏ మాత్రం మేలు జరగకుండా ఉండాలనేదే వైసీపీ ఆలోచన
  • విభజన హామీలపై మరింత స్పష్టత ఇవ్వాలని గట్టిగా కోరుతున్నాం

పార్లమెంటులో రేపు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఈ రోజు పార్లమెంటు ప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంటులో ఏనాడైనా విజయసాయిరెడ్డి నిరసన తెలిపారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందకుండా చేసేందుకు వైసీపీ నేతలు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

నిన్న తనను రాజ్యసభలో మార్షల్స్ బయటకు తీసుకెళుతుంటే అందరూ ఖండిస్తోంటే వైసీపీ ఎంపీ మాత్రం ఏమీ అడగలేదని అన్నారు. ఏపీకి ఏ మాత్రం మేలు జరగకుండా ఉండాలనేదే వైసీపీ ఆలోచనని సీఎం రమేశ్ చెప్పారు. పార్లమెంటులో తమ పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. విభజన హామీలపై మరింత స్పష్టత ఇవ్వాలని గట్టిగా కోరుతున్నామని చెప్పారు.

More Telugu News