Sonia Gandhi: పార్లమెంటులో ఊహించని పరిణామం.. టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు!

  • ఏపీ పరిణామాలపై ఆరా
  • పరిస్థితిని వివరించిన టీడీపీ ఎంపీలు
  • లోక్ సభలో ఆసక్తికర పరిణామం

ఈనాటి లోక్ సభ సమావేశాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంతనాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితి గురించి ఆమెకు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, పి.రవీంద్రబాబులు వివరించారు. ఈ ఘటన సభలో ఉన్నవారి దృష్టిని ఆకర్షించింది.

మరోవైపు, ఇదే సమావేశాల్లో ఏపీకి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అంటూ టీడీపీ ఎంపీలు ఆరోపించారు. మరోవైపు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా, ఆయన ఎదుట ప్లకార్డులు పట్టుకుని, నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఖర్గే పక్కనే సోనియా కూర్చున్నారు. ఆ సందర్భంగా టీడీపీ ఎంపీలపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినా, సోనియా మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు.

More Telugu News