India: నిన్న బయట, నేడు లోపల... టీడీపీ ఎంపీల కొత్త ఎత్తు!

  • బడ్జెట్ లో ఏపీకి అన్యాయం
  • విభజన హామీల అమలుకు పట్టుబడుతున్న టీడీపీ
  • నిన్న పార్లమెంట్ ఆవరణలో ధర్నా
  • నేడు సభలో నిరసన తెలపాలని నిర్ణయం

బడ్జెట్ తరువాత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని, విభజన హామీలను వెంటనే అమలు చేసి తాము కోరిన ప్రాజెక్టులన్నీ బడ్జెట్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ, నిన్న పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగిన తెలుగుదేశం ఎంపీలు, నేడు సభ లోపల నిరసనలు చేయాలని నిర్ణయించారు. నేడు సభ ప్రారంభం కాగానే, నిన్న ఇచ్చిన నోటీసులపై స్వల్పకాలిక చర్చ వెంటనే చేపట్టాలని పట్టుబట్టనున్నట్టు టీడీపీ పార్లమెంట్ సభ్యులు వెల్లడించారు.

 ఈ విషయంలో స్పీకర్ అంగీకరించకుంటే వెల్ లోకి వెళ్లి తమ నిరసనను తెలియజేస్తామని అన్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా, సాధ్యమైనన్ని ఎక్కువ డిమాండ్లను పరిష్కరించుకోవడమే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేలా కొత్త ఎత్తుగడలు వేయనున్నట్టు తెలిపారు. కాగా, లోక్ సభ, రాజ్యసభ నేటి సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 

More Telugu News