Tollywood: ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుతున్నారో, మధ్యతరగతినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది : తమ్మారెడ్డి భరద్వాజ

  • కేంద్రబడ్జెట్ లో నాకు నచ్చిన పథకం ఎన్ హెచ్ పీఎస్
  • దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికా? మధ్య తరగతికా? ఎవరికి?
  • వైద్య సదుపాయం అందించేది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనా? కార్పొరేట్ ఆసుపత్రుల్లోనా?
  • ‘నా ఆలోచన’ లో తమ్మారెడ్డి భరద్వాజ

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ లో తనకు నచ్చిన పథకం జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఎన్ హెచ్ పీఎస్) అని ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘నా ఆలోచన’ ద్వారా ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ‘మెడికల్ హెల్త్ కింద పది కోట్ల మందికి ఈ పథకం అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ పథకాన్ని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికా? లేక మధ్య తరగతికా? ఎవరికి దీనిని అమలు చేస్తారు? ఈ వైద్య సదుపాయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తారా? లేక కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందిస్తారా? కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికే భయంకరంగా రేట్లు ఉన్నాయి. ఒక రకమైన మోసం జరుగుతోంది.

ఈ ఆరోగ్య పథకం కింద కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం బాగానే ఉంది. అయితే, ప్రైవేటు ఆసుపత్రుల్లో రేట్లు బాగా పెరిగిపోతే ఆ ఐదు లక్షలు తొందరగా అయిపోతాయి. ఆ తర్వాత జబ్బులొస్తే పరిస్థితి ఏంటి? పెరిగిన రేట్ల ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు చార్జ్ చేస్తే, వాళ్లకు ఎదురు డబ్బు కట్టాల్సి వస్తుంది. అప్పుడు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి? కార్పోరేట్ ఆసుపత్రులను అదుపు చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుందా? దీనిపై సీరియస్ గా ఆలోచించాలి.

ఇక మధ్య తరగతి పరిస్థితి ఏంటి? ఇంకో, రెండు మూడు కేంద్ర బడ్జెట్ లు వచ్చే లోపు మధ్యతరగతి ప్రజలు పేదలైపోతారేమో! ట్యాక్స్ లు కట్టే వాళ్లు, రాయితీలు లేని వాళ్లు, అన్ని రకాల ఇబ్బందులు పడేవాళ్లు మధ్యతరగతి వాళ్లే! వీళ్ల సంపాదనలో ఎక్కువ శాతం ట్యాక్స్ లకే వెళ్లిపోతోంది! ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుతున్నారో, మధ్యతరగతిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది’ అని అభిప్రాయపడ్డారు. 

More Telugu News