Karnataka: కర్ణాటకలో గెలుపు కోసం బీజేపీ క్షుద్రపూజలు: కాంగ్రెస్

  • గోవుల  సంరక్షణ కోసం బీజేపీ ‘గో యజ్ఞం’
  • క్షుద్రపూజలన్న కాంగ్రెస్
  • గోవుల గురించి పాకిస్థాన్‌లో మాట్లాడాలా? అంటూ బీజేపీ కౌంటర్
  • కర్ణాటకలో వేడెక్కుతున్న ఎన్నికల రాజకీయం

త్వరలో రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో ఇప్పటి నుంచే రాజకీయ వేడి రగులుతోంది. గోవుల సంక్షేమం కోసం రాష్ట్ర నేతలు 24 గంటల ‘గో యజ్ఞం’ నిర్వహించారు. ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనకు ముందు ఈ యజ్ఞం నిర్వహించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే  అది గో యజ్ఞం కాదని, క్షుద్రపూజలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మంత్రతంత్రాలను ఉపయోగిస్తోందని మండిపడింది.

‘‘అది యజ్ఞం కాదు. బీజేపీ క్షుద్ర పూజలు చేస్తోంది. రాజస్థాన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీకి కర్ణాటకలో గెలవలేమని తెలుసు. అందుకే వారు క్షుద్రపూజలతో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తారు. ప్రజలు ఇటువంటి మంత్రతంత్రాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీతో అప్రమత్తంగా ఉండండి’’ అని కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ అంతే ఘాటుగా బదులిచ్చింది. కాంగ్రెస్ మద్దతుదారులు గోవులను చంపేస్తున్నారని బీజేపీ కర్ణాటక ఇన్‌చార్జ్ మురళీధర్ రావు ఆరోపించారు. గోవుల గురించి మాట్లాడాల్సిందేనని స్పష్టం చేశారు. గోవుల గురించి భారత్‌లో కాకపోతే పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో మాట్లాడతామా? అని ప్రశ్నించారు. గోవుల గురించి మాట్లాడడం జాతి వ్యతిరేకత ఎలా అవుతుందని కాంగ్రెస్‌ను నిలదీశారు.

బెంగళూరులో బీజేపీ నిర్వహించిన 24 గంటల గో యజ్ఞానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. భజనలు, రామాయణ పఠనంతో యజ్ఞం సాగింది. అయితే మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఉండడంతో బీజేపీ రాష్ట్ర నేతలు యజ్ఞంలో పాల్గొనలేదు.

More Telugu News