KTR: నాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వద్దు సారూ: కేటీఆర్ తో ఓ మహిళ

  • ఇందిరమ్మ ఇచ్చిన స్థలం ఉంది... షెడ్డు వేసివ్వండన్న మహిళ
  • సొంత డబ్బులతో ఇల్లు బాగుచేయిస్తానన్న కేటీఆర్
  • సిరిసిల్ల జిల్లాలో ఆసక్తికర ఘటన

తెలంగాణ మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తామాద్ మండల కేంద్రంలో పర్యటించారు. అక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ మహిళ కేటీఆర్ తో మాట్లాడుతూ, "నాకు డబుల్ బంగ్లా వద్దు సారూ. ఇందిరమ్మ ఇచ్చిన జాగా ఉంది. అందులో గుడిసె వేసుకుని ఉన్నా. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. ఆ జాగాలో ఒక రేకుల షెడ్డు వేసిచ్చి ఆదుకోండి" అంటూ వేడుకుంది.

దీంతో కేటీఆర్ స్పందిస్తూ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పారు. రెండు ప్రభుత్వ ఆస్తులు తనకు వద్దని... లేని వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి, తనకు రేకుల షెడ్డు వేయిస్తే చాలని ఆమె చెప్పింది. దీంతో, తన సొంత డబ్బులతో ఇల్లు బాగు చేయించి ఇస్తానని ఆమెకు కేటీఆర్ హామీ ఇచ్చారు.

More Telugu News