New Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. స్కూల్ బాత్‌రూమ్‌లో విద్యార్థి మృతదేహం

  • స్నేహితులే చంపినట్లు అనుమానం
  • పోస్టుమార్టం రిపోర్టు వస్తే తెలుస్తుందంటోన్న పోలీసులు
  • అనారోగ్యం కారణంగా మృతి చెందాడంటోన్న స్కూల్‌ యాజమాన్యం
  • ఇది హత్యేనంటోన్న విద్యార్థి తల్లిదండ్రులు

ఢిల్లీలోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌ లో రెండో తరగతి విద్యార్థి ప్రద్యుమ్న్ ఠాకూర్ (7) దారుణంగా హత్యకు గురైన ఘటనను మరవక ముందే మళ్లీ అదే నగరంలో ఇటువంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. కరవాల్ నగర్లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి తుషార్ కుమార్ బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

సీసీటీవీ కెమెరాను పరిశీలించిన పోలీసులు.. తుషార్ కుమార్‌, మరో ముగ్గురు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు.తుషార్‌ను ఆ ముగ్గురు విద్యార్థులు చితక్కొట్టి, అనంతరం టాయిలెట్ వద్దకు తీసుకెళ్లి తుషార్‌ను పడేసినట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. తుషార్ అనారోగ్యం వల్లే మృతి చెందాడని చెబుతోంది.

తమ కుమారుడిది హత్యేనని కుమార్ తల్లిదండ్రులు అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తుషార్ మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుషార్ స్నేహితులను విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News