baby rape: అమానుషం... 8 నెలల పాపను కూడా వదలని కీచకుడు

  • ఢిల్లీలోని సుభాష్ నగర్ లో దారుణం
  • పాపను ఆడిస్తానంటూ ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసిన బావ
  • పరారీలో ఉన్న యువకుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. 8 నెలల పసికందును కూడా కీచకుడైన బంధువు వదల్లేదంటే సమాజం ఎంత దిగజారిపోతోందో అర్థమవుతుంది. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్ లో గృహనిర్మాణ కార్మికురాలు, అడ్డకూలి దంపతులు నివాసం ఉంటున్నారు. పక్కింట్లో ఉండే మహిళను చూస్తూ ఉండమని 8 నెలల బాలికను తల్లి బయటకు వెళ్లింది. ఇంతలో పాపను ఆడిస్తానంటూ వరసకు బావయ్యే 28 ఏళ్ల యువకుడు ఇంట్లోకి వెళ్లాడు. ఆ తరువాత కాసేపటికి ఇంటికి వచ్చిన తల్లి, రక్తపు మడుగులో ఉన్న బాలికను చూసి విలపిస్తూ ఆసుపత్రికి తరలించగా, పసికందుపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారణ అయింది.

పాప ప్రాణాలు మాత్రం నిలపగలిగామని, కోలుకునేందుకు సమయం పడుతుందని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్టు చేయగా, నేరం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అతనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగికదాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి మాలివాల్‌ ఘాటుగా స్పందిస్తూ, ‘‘ఇప్పుడే ఆస్పత్రికి వెళ్లొచ్చాను. ఎనిమిది నెలల పసిగుడ్డుపై ఇంత దారుణంగా అత్యాచారం జరిగితే ఢిల్లీ ఎలా నిద్రపోగలుగుతున్నది? మన సమాజం ఇంత మొద్దుబారిందా, ఇది ఆడపిల్లల తలరాత అనుకోవాలా! వాళ్లేరి? మహిళల గౌరవాన్ని కాపాడుతామంటూ స్కూల్‌ బస్సులపై దాడులు చేసిన సేనలు ఎక్కడ?’’ అంటూ సమాజాన్ని నిలదీశారు. 

More Telugu News